అల్లసాని పెద్దన
ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్తానంలోని అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రథమ ప్రబంధముగా ప్రసిద్ధికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు. ఒక గొప్ప యాంధ్రకవి. ఇతఁడు బళ్లారి కడప జిల్లాలప్రాంతములయందు దూపాడు అను దేశంబున దొరాళ అను గ్రామము వాసస్థలముగా కలవాఁడు. ఈయన శాలివాహనశకము 1430 సంవత్సరమున జన్మించినట్లు తెలియఁబడుచున్నది. కృష్ణదేవరాయలవారి ఆస్థానపండితులు ఎనమండ్రలోను ఈతఁడు ఒక్కఁడు అయి ఉండినదికాక ఆరాజుచే ఆంధ్రకవితాపితామహుఁడు అను బిరుదాంకము సహితము పడసెను. ఈతనికృతి స్వారోచిషమనుసంభవము. ఇది మిక్కిలి ప్రౌఢకావ్యము.
అల్లసాని పెద్దన | |
జననం | 15, 16 శతాబ్దాల నడుమ బళ్ళారి మండలం, దోరాల (దోర్ణాల) గ్రామం |
---|---|
ఇతర పేర్లు | ఆంధ్ర కవితా పితామహుడు |
రచనలు | స్వారోచిషమనుసంభవము లేదా మనుచరిత్ర |
గురువు | శఠగోపయతి |
ఆశ్రయమిచ్చిన రాజులు | శ్రీ కృష్ణదేవ రాయలు |
అల్లసాని వారిదే ప్రాంతం అన్న విషయం ప్రసక్తికి వచ్చినపుడు వేటూరు ప్రభాకరశాస్త్రిగారు ‘బళ్లారి ప్రాంతమందలి దోపాడు పరగణాలోని దోరాల గ్రామమీతని వాసస్థలము’ అన్నారు (సింహావలోకనము). కాని పరిశోధకులు అధిక సంఖ్యాకులు పెద్దన కోకటం గ్రామమన్నారు. వై.యస్.ఆర్ (కడప) జిల్లాలోని కమలాపురానికి సమీపంలో కోకట గ్రామం ఉంది. ఆ గ్రామంలో సకలేశ్వరుడూ ఉన్నాడు. ప్రక్కన పెద్దనపాడు ఉంది. ఆయన పేరు మీదనే పెద్దనపాడు ఏర్పడిందంటారు[1].
రచనలు
- స్వారోచిషమనుసంభవము (మనుచరిత్ర)
- అలభ్య రచనలు
- హరికథాసారము
- రామస్తవరాజము
- అద్వైత సిద్ధాంతము
- చాటు పద్యాలు
ఇవీ చూడండి
మూలాలు
- ఎం.వి.ఎల్., నరసింహారావు (1974). కావ్యపరిచయాలు-మనుచరిత్ర (1 ed.). హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ. p. 1.