తెనాలి రామకృష్ణుడు
తెనాలి రామకృష్ణుడు శ్రీ కృష్ణదేవరాయలు ఆస్థానములోని కవీంద్రులు. స్మార్తం శాఖలోని నియోగి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. అష్టదిగ్గజములలో సుప్రసిద్ధులు. ఈయనని తెనాలి రామలింగ కవి అని కూడా అంటారు. అవిభాజ్య విజయనగర సామ్రాజ్య చరిత్రలో ఈయన ప్రముఖులు. తొలుత సాధారణ వ్యక్తి అయిన రామకృష్ణులు, కాళీమాత వర ప్రసాదం చేత కవీశ్వరులయ్యారు. గొప్ప కావ్యాలు విరచించారు. కానీ తెలుగు వారికి ఆయన ఎక్కువగా హాస్య కవిగానే పరిచయం. ఆయనకు వికటకవి అని బిరుదు ఉంది. ఆయనపై ఎన్నో కథలు ఆంధ్ర దేశమంతా ప్రాచుర్యములో ఉన్నాయి.మొదట్లో రామకృష్ణుడి ఇంటి పేరు గార్లపాటి అని, తెనాలి నుండి వచ్చారు కనుక తరువాతి కాలంలో తెనాలి అయినది అని ఒక నానుడి. సత్తెనపల్లి మండలంలోని లక్కరాజుగార్లపాడు గ్రామానికి చెందిన గార్లపాటి రామయ్య, లక్ష్మాంబల సంతానం రామలింగయ్య. ఆయన తాత సుదక్షణా పరిణయం రాసిన అప్పన్న కవి. వీరికి ఇద్దరు సోదరులు వరరాఘవకవి, అన్నయ్య. రామకృష్ణుడి స్వస్థలం తెనాలి. ఇదే గ్రామాన్ని ఆయన అగ్రహారంగా పొందినాడు.[1] రామలింగయ్య తాత, ముత్తాతలు గార్లపాడు లోనే నివసించారు. ప్రస్తుతం గ్రామ బొడ్రాయి ప్రతిష్ఠించిన ప్రాంతంలోనే రామకృష్ణుల వారి ఇల్లు ఉండేదని గ్రామస్తుల నమ్మకం. క్రీ.శ. 1514 నుంచి 1575 వరకు రామలింగయ్య జీవించారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులు మరణించడంతో మేనమామ తెనాలి అగ్రహారమైన తూములూరుకు తీసుకువెళ్లారు. అక్కడే వారి సంరక్షణలో విద్యాబుద్ధులు నేర్చుకున్నారు.
తెనాలి రామకృష్ణుడు | |
---|---|
తెనాలి రామలింగ కవి | |
జననం |
Garalapati Ramakrishna 16th century Garalapadu, Guntur District Andhra Pradesh, India |
మరణం | హంపి |
ఇతర పేర్లు | తెనాలి రామలింగ కవి |
వృత్తి | కవీశ్వరులు |
ప్రసిద్ధి |
వికటకవి, అష్టదిగ్గజాలలో ఒకరు |
సాధించిన విజయాలు | శ్రీ కృష్ణదేవరాయల వారి ఆస్థాన కవీంద్రులు |
పదవీ కాలము | 15వ శతాబ్దం |
మతం | శైవ స్మార్తం నియోగి బ్రాహ్మణులు |
తల్లి | లక్ష్మమ్మ |
రచనలు
ఉద్బటారాధ్య చరిత్ర ఉద్భటుడు అనే యతి గాథ. ఘటికాచల మహాత్మ్యము తమిళనాడు రాష్ట్రంలోని వేలూరు మండలంలోని ఘటికాచల (ప్రస్తుతం షోళింగుర్) క్షేత్రంలో వెలసిన శ్రీ నరసింహ స్వామి వారిని స్తుతిస్తూ వ్రాసిన కావ్యం. పాండురంగ మహాత్మ్యము స్కాంద పురాణము లోని విఠ్ఠలుని మహాత్మ్యాలు మరియు ఇతర పాండురంగ భక్తుల చరిత్రల సంపుటం.
అలభ్య రచనలు
- కందర్పకేతు విలాసము
- హరిలీలా విలాసము
ఇవి అలభ్య గ్రంథములు. జగ్గన గారి ప్రబంధ రత్నాకరము లోని కొన్ని పద్యాల వల్ల ఈ గ్రంథ వివరాలు తెలుస్తున్నాయి.
శైలి
తెనాలి వారు ప్రబంధ శైలిని అనుసరించేవారు. ఇంకనూ వారి కవిత్వంలో హాస్యము, వ్యంగ్యము రంగరించబడి ఉంటాయి
చాటువులు
వీరు చాటువులు చెప్పడంలో బహు నేర్పరి.
అల్లసాని పెద్దన వారితో
ఒకమారు అల్లసాని పెద్దన వారు ఒక కవితలో "అమావాశ్యనిశి"ని ఛందస్సు కోసం "అమవసనిసి" అని వాడగా దానికి రామలింగకవి చెప్పిన అద్భుతమైన చాటువు,
ఎమి తిని సెపితివి కపితము
బెమ పడి వెరి పుఛ్చ కాయ మరి తిని సెపితో
ఉమెతకయలు తిని సెపితో
అమవస నిసి యనుచు నేడు అలసని పెదనా ||
ఇక్కడ "అలసని" అని హేళన చేస్తూ, అమవసనిసి అనేది స్వచ్ఛత లేని పదం అని కవీంద్రులు ఘాటుగానే సెలవిచ్చారు.
ధూర్జటి వారితో
ధూర్జటి వారిని స్తుతిస్తూ రాయలు :
స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ
యతులిత మాధురీ మహిమ ?
దానికి రామకృష్ణుని చమత్కార సమాధానం:
హా తెలిసెన్! భువనైక మోహనో
ద్ధత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం
తత మధురాధరోద్గత సుధా రస ధారల గ్రోలుటం జుమీ !!
అంటూ ధూర్జటి వారి వేశ్యా సాంగత్యాన్ని ఎత్తి చూపారు.
కావలి తిమ్మడు
మరొకమారు వాకిటి కావలి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పథకం వేసి
వాకిటి కావలి తిమ్మా !
ప్రాకటముగ సుకవివరుల పాలిటి సొమ్మా !
నీకిదె పద్యము కొమ్మా !
నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!
అంటూ చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి
తిరుమలరాయల గురించి
రాయల సోదరులైన తిరుమలరాయలు తనపై కవిత చెప్పుమని అష్టదిగ్గజములని అర్ధింపగా, అందవిహీనుడు, ఒంటి కన్ను వాడైన తిరుమలరాయల గూర్చి యేమి కవిత్వం చెప్పాలి అని సంశయంలో ఉండగా, రామకృష్ణ కవి ఇలా స్తుతించాడు.
అన్నాతి గూడ హరుడవె
అన్నాతిని గూడనప్పుడసురగురుడవే!
అన్నా తిరుమలరాయా
కన్నొక్కటి కలదు కాని కౌరవపతివే!||
(భార్యతో ఉన్నపుడు నీవు హరుడవు, భార్య ప్రక్కన లేనపుడు రాక్షసగురువైన శుక్రాచార్యుడవు, అన్నా తిరుమలరాయా, నీకు ఒక కన్ను ఉంది కానీ అది లేకపోయి ఉంటే కురుపతి దృతరాష్టుడివి)
తాతాచార్యుల వారితో
ఒకసారి తెనాలి రామకృష్ణుడు లేని సమయంలో శ్రీ కృష్ణ దేవరాయలు "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అనే సమస్యను పూరణకివ్వగా, సభలో ఎవ్వరూ పూరించలేకపొయారు. అది తెనాలి రామలింగడు ఎలా పూరిస్తాడా అని రాజగురువు తాతాచార్యులవారు అదే సమస్యని ఒక ద్వారపాలకుడితో అడిగిస్తాడు. దానికి తెనాలి రామలింగడి పూరణః
గంజాయి త్రాగి తురకల
సంజాతల గూడి కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా ఎచ్చట
కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్
అదే సమస్యని రామలింగ కవి శ్రీ కృష్ణ దేవరయల సమక్షంలో పూరించిన విధం:
రంజన చెడి పాందవులరి
భంజనులై విరటు గొల్వ పాల్పడిరకటా!
సంజయ! విధి నేమందును
కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్
భట్టు మూర్తి కవిత్వం గురించి అవహేళన చేస్తూ
చీపర బాపర తీగల చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ కాపు కవిత్వపు కూతలు బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !!
రాయల వారిని పెద్దన పొగడిన పద్యం
చీపర బాపర తీగల చేపల బుట్టల్లినట్లు చెప్పెడి నీ యీ కాపు కవిత్వపు కూతలు బాపన కవి వరుని చెవికి ప్రమదంబిడునే !!
శర సంధాన బల క్షమాది వివిధైశ్వర్యంబులన్ గల్గి దు ర్భర షండత్వ బిల ప్రవేశ కలన బ్రహ్మఘ్నతల్ మానినన్ నర-సింహ-క్షితి మండలేశ్వరుల నెన్నన్ వచ్చు నీ సాటిగా నరసింహక్షితి మండలేశ్వరుని కృష్ణా ! రాజ కంఠీరవా !
( అర్జునుడు, సింహము, క్షితి - ఈ మూడింటిలోని లోపాలు గణించక పోతేనే వీటిని నీతో పోల్చ వచ్చు అని భావం. ఐతే ఒక పాదంలో సింహం తో పోల్చ రాదంటూనే పద్యం చివర ‘రాజ సింహమా’ అని పిలవడం ఏం సబబు ? అని తప్పు చూపించి తెనాలి రామకృష్ణ కవి చెప్పిన పద్యం)
కలనన్ తావక ఖడ్గ ఖండిత రిపు క్ష్మా భర్త మార్తాండ మం డల భేదంబొనరించి యేగునెడ తన్మధ్యంబునన్ తార కుం డల కేయూర కిరీట భూషితుని శ్రీ నారాయుణుం గాంచి లో గలగంబారుతునేగె నీవయనుశంకన్ కృష్ణరాయాధిపా !!
(ఇంకో పద్యం)
నరసింహ కృష్ణ రాయని కరమరుదగు కీర్తి యొప్పె కరిభిత్ గిరిభిత్ కరి కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభి త్తురంగ కమనీయంబై !
(‘కుంజర యూధంబు..’ అనే సమస్యా పూరణ నిచ్చినందుకు కోపం తో)
గంజాయి తాగి తురకల సంజాతుల గూడి కల్లు చవి గొన్నావా లంజల కొడకా ఎక్కడ కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్ !!
(అదే సమస్యను రాయల వారు అడిగినప్పుడు)
రంజన చెడి పాండవులరి భంజనులై విరటు గొల్వ పాల్పడి రకటా సంజయ విధి నే మందును కుంజర యూధంబు దోమ కుత్తుక సొచ్చెన్ !!
(‘గొల్వు పాలై రకటా’ అని పాఠాంతరం)
(నంది తిమ్మనను పొగడుతూ)
మా కొలది జానపదులకు నీ కవనపు ఠీవి యబ్బునే ! కూపనట ద్భేకములకు గగనధునీ శీకరముల చెమ్మ నంది సింగయ తిమ్మా !
(మూడో పాదంలో ‘గగన ధునీ’ అనే ప్రయోగాన్ని ‘నాక ధునీ’ అని మార్చి ‘రాజ కవి’ (కృష్ణ రాయలు) ‘కవి రాజు’ (రామకృష్ణుడు) ప్రశంసను పొందాడని ప్రతీతి)
(వాకిటి కాపరి తిమ్మడికి రాయలిచ్చిన పచ్చడాన్ని కాజేయటానికి ముగ్గురు ఇతర దిగ్గజాలతో పధకం వేసి చివరి పాదంతో పచ్చడం కొట్టేసాడు రామకృష్ణ కవి )
వాకిటి కావలి తిమ్మా ! ప్రాకటముగ సుకవి వరుల పాలిటి కొమ్మా ! నీకిదె పద్యము కొమ్మా ! నాకీ పచ్చడమె చాలు నయముగ నిమ్మా !!
(ధూర్జటిని స్తుతిస్తూ రాయలు :
స్తుతమతి యైన యాంధ్ర కవి ధూర్జటి పల్కుల కేల కల్గెనీ యతులిత మాధురీ మహిమ ?
(దానికి రామకృష్ణుని కూమత్కార సమాధానం) హా తెలిసెన్ భువనైక మోహనో ద్దత సుకుమార వార వనితా జనతా ఘన తాప హారి సం తత మధురాధరోదత సుధా రస ధారల గ్రోలుటంజుమీ
ఈ పద్యాలు రామలింగని సమయ స్ఫూర్తిని, కవితా పటిమను చాటి చెపుతాయి.
ప్రెగడరాజు నరస కవి వారి పరాభవం
ఒకమారు, ప్రెగడరాజు నరస కవి అనే ఒక ఉద్దండ పండితుడు రాయల వారి కొలువు సందర్శించి, వారికి ఒక క్లిష్ట సమస్య ఇచ్చారు. అదేమంటే, ఈ కొలువులో ఎవరైనా తను రాయలేనంత కఠినమైన చాటువు చెప్పగలరా అని. ఆ సమయములో రాయలు వారు మొదట అల్లసాని పెద్దన వారి వైపు చూసారట. అల్లసాని వారు కొంత సమయము తీసుకొంటుండగా, తెనాలి వారు అందుకొని పండితుల వారిని తికమక పెట్టేలా ఈ చాటువు వల్లించారట.
త్బృ....వ్వట బాబా తల పై
బు....వ్వట జాబిల్లి వల్వ బూదట చేదే
బువ్వట చూడగ హుళులు....
క్కవ్వట నరయంగ నట్టి హరునకు జేజే !!
ఇది ఆయన సమయస్ఫూర్తికి మచ్చుతునక. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ అల్లసాని పెద్దన వారు, "షఠ్ఝా మఠ్ఝ కరాడ్ఝ్య వేడ్ఝ్య వసు తఢ్ఝా తఠ్ఝ తఠ్ఝ్యా ఖరే ..." అంటూ చెప్పిన చాటువు అద్భుతం అద్వితీయం.
ఏ పద్యానికైనా అర్ధం చెప్పెదనన్న నరస కవి కి, "మేకతోకకు మేక, తోకమేకకు తోక, తోకమేకాతోక తోకమేక ...... మేకకొక తోక, మెక మేక తోక తోక ......." అనే పద్యము అప్పగించిరి. ఇంకనూ నరస కవి గారు ఇతరుల కవిత్వంలో తప్పులు ఎంచెదననినందులకు కోపంతో,
ఒకని కవిత్వమందెనయునొప్పులు తప్పులు నా కవిత్వమం
దొకనికి తప్పు బట్ట పని యుండదు కాదని తప్పు బట్టినన్
మొకమటు క్రిందుగా దిగిచి మ్రొక్కలు వోవ నినుంప కత్తితో
సిక మొదలంట గోతు మరి చెప్పున గొట్టుదు మోము దన్నుదున్ !!
అంటూ, ఇంకనూ శాంతింపక,
తెలియని వన్ని తప్పులని దిట్ట తనాన సభాంతరంబునన్
పలుకగ రాదురోరి పలు మారు పిశాచపు పాడె గట్ట నీ
పలికిన నోట దుమ్ము వడ భావ్య మెరుంగక పెద్దలైన వా
రల నిరసింతువా ప్రగడ రాణ్ణరసా విరసా తుసా భుసా !!
అని దులిపివైచెను.
మూలాలు
- నూరేళ్ళ తెనాలి ఘనచరిత్ర, రచన బిళ్ళా జవహర్ బాబు, ముద్రణ 2010, పేజీ 21
- తెనాలి రామలింగ
- Tenali Ramakrishna
- K.A. Nilakanta Sastry, History of South India, From Prehistoric times to fall of Vijayanagar, 1955, OUP, New Delhi (Reprinted 2002) ISBN 0-19-560686-8
- Golden age of Telugu Literature
- Literary activity in Vijayanagara Empire
- Tenali Ramakrishna's entry into Bhuvana Vijayam
బయటి లింకులు
అష్టదిగ్గజములు |
---|
అల్లసాని పెద్దన | నంది తిమ్మన | ధూర్జటి | మాదయ్యగారి మల్లన | అయ్యలరాజు రామభధ్రుడు | పింగళి సూరన | రామరాజభూషణుడు | తెనాలి రామకృష్ణుడు |